నేషనల్ కాన్ఫరెన్స్ కు ఇద్దరు సైన్స్ టీచర్స్ ఎంపిక
మహాదేవపూర్ ఉపాధ్యాయులలో హర్షం..
కాటారం (విజయక్రాంతి): ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్ పూర్ లో ఈ నెల 5వ తేది నుండి 8వ తేది వరకు జరగనున్న నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ బాలుర పాఠశాల సైన్స్ టీచర్ బి. ప్రభాకర్ రెడ్డి, బాలికల పాఠశాల సైన్స్ టీచర్ మడక మధు ఇద్దరు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆహ్వానం లేఖ అందింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 162 మంది సైన్స్ టీచర్స్ ఎంపికయ్యారు. తెలంగాణ నుండి ఎంపికైన ముగ్గురిలో ఇద్దరూ మహాదేవపూర్ ఉపాధ్యాయులు కావడం గర్వకారణంగా పేర్కొంటున్నారు.
ఈ కాన్ఫరెన్స్ నెట్వర్క్ ఆఫ్ ఆర్గనైజషన్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్, ఇస్రో, నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్, నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్, ఇండియన్ యంగ్ ఇన్వెంటర్స్ అండ్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కాన్ఫరెన్స్ గత పద్నాలుగు సంవత్సరాలుగా సైన్స్ అభివృద్ధికి కృషి చేస్తూ, సైన్స్, మాథ్స్ టీచర్స్ కు వేదికగా టీచర్స్ సైన్స్ కాంగ్రెస్ను నిర్వహిస్తోందని ఎంపికైన టీచర్లు బొక్కల ప్రభాకర్ రెడ్డి, మడక మధుకర్ లు "విజయక్రాంతి" కి వివరించారు.
ఈ కాన్ఫరెన్స్ ప్రముఖ శాస్త్రవేత్తలతో సంభాషించడానికి అవకాశం కల్పిస్తూ యువ వర్ధమాన శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులు, ఆవిష్కర్తలు, పరిశోధకులు తమ వినూత్న ఆలోచనలను, ప్రాజెక్టులను, పరిశోధన పత్రాలను ప్రదర్శించడానికి ఈ కాన్ఫరెన్స్ చక్కని వేదిక. దీనికి ఎంపికైన ఉపాధ్యాయులను మండల విద్యాధికారి, ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.






