23-09-2025 12:17:42 AM
15 ఏళ్లుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా దీక్ష స్వీకరిస్తున్న సంజయ్
కరీంనగర్, సెప్టెంబర్22(విజయక్రాంతి): దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమబరం ఉదయం కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో ‘భవానీ దీక్ష’ చేపట్టారు.ఆయనతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు భవానీ దీక్ష చేపట్టారు. విజయదశమి వరకు బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు.
సామాన్య భక్తుడివలే మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడపుతూ అమ్మవారిని సేవిస్తారు.బండి సంజయ్ భవానీ దీక్ష చేపట్టడం 15వసారి. మహాశక్తి ఆలయ ప్రతిష్టాత్మక మహోత్సవం సందర్భంగా 2011లో తొలిసారిగా బండి సంజయ్ ‘భవానీ దీక్ష’ చేపట్టారు. ఆనాడు ఆయనతోపాటు మరో ఐదారుగురు మాత్రమే దీక్ష చేపట్టారు.
అధ్యాత్మకంగా హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ భవానీ దీక్ష చేపట్టాలనే ఉద్దేశంతో బండి సంజయ్ ప్రోత్సహిస్తున్నారు.ఖర్చుతో పనిలేకుండా, భవానీ దీక్ష చేపట్టాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు. భవానీ దీక్ష చేపట్టే భక్తులందరికీ దేవాలయంలో చేపట్టే అన్ని రకాల పూజలు, సేవలు ఉచితంగా అందుబాటులో ఉంచారు.
భగవంతుడికి భక్తులందరూ సమానమేనని చాటి చెప్పేందుకు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. దేవాలయ ఆవరణలో అన్నదానం ఏర్పాటు చేశారు. బండి సైతం వారితో కలిసి ప్రతిబరోజుభోజనంచేస్తారు.