ఆ ఫోన్లకు ‘యూపీఐ’ సేవలు బంద్
ఆదేశాలు జారీ చేసిన ఎన్పీసీఐ
న్యూఢిల్లీ: చాలా రోజుల నుంచి వాడుకలో లేని మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలు నిలివేయనున్నారు. ఇందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(National Payments Corporation of India) బ్యాంకులు, పేమెంట్ సేవలందించే సంస్థలకు కూడా నోటీసులు ఆదేశాలిచ్చింది. కొద్ది రోజులుగా మన దేశంలో యూపీఐ లావాదేవీల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ తాజా నిర్ణయంతో లావాదేవీల సంఖ్య తగ్గినా కానీ మోసాలు, అనధికార వాడకం తగ్గే అవకాశం ఉంది.
ఎవరికి సేవలందవంటే..
ఎన్పీసీఐ తాజా నిర్ణయంతో ఎవరికి సేవలు నిలిచిపోతాయోనని అంతా గాబరా పడుతున్నారు. చాలా రోజులుగా వాడని నంబర్లకు ఈ సేవలు నిలిచిపోనున్నాయి. చాలా రోజుల నుంచి నంబర్ వాడకంలో లేకపోతే నెట్వర్క్ ప్రొవైడర్లు ఆ నంబర్ను మరో వినియోగదారునికి కేటాయిస్తాయి. అటువంటి సమయంలో ఆ నంబర్తో ఉన్న యూపీఐ ఖాతాలు కూడా వేరే వినియోగదారులు నిర్వహించేందుకు వీలుంటుంది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్పీసీఐ తాజా నిర్ణయం తోడ్పడనుంది. ఫోన్ నంబర్ మార్చినా కానీ బ్యాంకుల వద్ద ఎవరైతే నంబర్ను మార్చరో వారి మీద ఈ నిర్ణయం ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది






