15 April, 2026 | 10:14 AM

సంక్రాంతి పండక్కు ఊరెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి

10-01-2026 06:48 PM

రూరల్ ఎస్ఐ బి.సురేష్

పాల్వంచ,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే సమయంలో దొంగతనాలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ బి.సురేష్ సూచించారు. ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, నగదు, బంగారం తదితర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచుకోవాలని తెలిపారు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చలనం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ప్రజల ఆస్తి భద్రత కోసం పాల్వంచ రూరల్ పోలీసులు పండుగ సీజన్‌లో నిరంతర గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా, నేరాలను ముందుగానే నివారించడం కూడా పోలీసుల బాధ్యతేనని, ఇందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రజలు సహకరిస్తే దొంగతనాలను పూర్తిగా అరికట్టవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. పండుగ సీజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల ఇళ్ల భద్రతకు పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.