10-01-2026 06:53:11 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): రవీంద్ర భారతిలో గ్లోబల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో మోక్ష దృతి నిర్వహించిన కూచిపూడి నాట్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఘట్ కేసర్ సర్కిల్ ఎన్ఎఫ్సీ నగర్ కు చెందిన కూచిపూడి నాట్య కళాకారిణి మోక్ష దృతి అద్భుతమైన అభినయంతో నాట్య ప్రదర్శన చేసి ప్రేక్షకుల మన్ననలు పొందడంతో పాటు అభినందనలు అందుకున్నారు.
గ్లోబల్ ఈవెంట్స్ అధ్యక్షుడు కే.వి రమణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొల్లేటి దామోదర్ గుప్తా, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచిన కళాకారులకు జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాట్య గురువులు ఝాన్సీరామ్, సునీత, అంజన, కవిత భారతి, నిర్మల, మైథిలి తదితరులు పాల్గొని కళాకారులను ప్రోత్సహించారు. సంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమం సాంస్కృతికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.