12-07-2025 01:37:47 AM
సీఎంఆర్ డెలివరీ వేగం పెంచాలి
జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
వెల్దుర్తి, జూలై 11 : క్షేత్రస్థాయిలో ఓటర్ నమోదు ప్రక్రియను బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. లోశుక్రవారం వెల్దుర్తి మండలం విస్తృతంగా పర్యటించి బిఎల్ఓ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప్పులింగాపూర్ గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యా ప్రమాణాలు పరిశీలించిన అనంతరం శివసాయి రైస్ మిల్లును పరిశీలించారు.
ముందుగా బీఎల్వో అవగాహన సదస్సుకు హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో నూతన ఓటు నమోదు ప్రక్రియ, మృతి చెందిన ఓటర్ల వివరాలు, వలస ఓటర్లు, ఓటు నమోదులో తప్పిదాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఓటర్ నమోదు ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా సక్రమంగా చేపట్టాలని తెలిపారు.
ఎంపీపీ పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం మండల కేంద్రంలో శివ సాయి రైస్ మిల్లును తనిఖీ చేశారు. సీఎంఆర్ డెలివరీ విషయంలో వేగం పెంచాలని, నిర్దేశిత గడువు తేదీలోగా పూర్తి చేయాలని మిల్లు యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.