చనిపోయిన అభ్యర్థికి 165 ఓట్లు..!
మహబూబాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి గుండెపోటుతో ఎన్నికలకు ముందు మృత్యువాత పడ్డాడు. ఎన్నికలకు ముందే మరణించిన ఆ అభ్యర్థికి ఓటర్లు 165 ఓట్లు వేయడం విశేషంగా మారింది. ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రా మంలో చోటుచేసుకుంది. గండివాడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బుచ్చిరెడ్డి కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచాడు.
ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయించారు. రెండు రోజుల క్రితం వరకు ఆయన తన గెలు పు కోసం గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. సోమవారం ఇదే తరహాలో ప్రచారం నిర్వహించి ఇంటికి వెళ్లగా గుండెపోటు రావడంతో ఆయనను ఖమ్మం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. అప్పటికే బ్యాలెట్ పత్రాలు ముద్రించడంతో గురువారం జరిగిన ఎన్నికల్లో ఆయన గుర్తు అలాగే రావడంతో ఓటర్లు ఆయనకు 165 ఓట్లు వేసి మద్దతు ప్రకటించారు. చనిపోయిన అభ్యర్థికి 165 ఓట్లు రాగా, విజయ్ అనే అభ్యర్థి సర్పంచిగా విజయం సాధించాడు.




