27-09-2025 01:52:48 AM
లడఖ్, సెప్టెంబర్ 26: లడఖ్ ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి విరమించిన ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ను శుక్రవారం జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద లేహ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం లేహ్లో తీవ్ర స్థాయిలో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో నలుగురు చనిపోగా.. 70 మందికి పైగా గాయపడ్డారు. ఈ హింసాత్మక అల్లర్లకు సోనమ్ వాంగ్ చుక్ వ్యాఖ్యలే కారణమని హోం మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
సరైన నిబంధనలు పాటించడం లేదంటూ వాంగ్ చుక్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘ది స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్’పై హోంమంత్రిత్వ శాఖ గురువారం చర్యలు తీసుకుంది. ఎన్జీవో పనితీరులో తీవ్ర ఆర్థిక అవకతవకలను గుర్తించామని ఫారిన్ ఫండింగ్ లైసెన్స్ను రద్దు చేసింది.
హోం మంత్రిత్వ శాఖ చర్యలపై వాంగ్చుక్ అసహనం వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారం చూపకుండా ఇలా చేయడం తెలివి తక్కువ పనిఅంటూ ఆరోపించారు. కాగా శుక్రవారం పోలీసులు జాతీయ భద్రత చట్టం ఎన్ఎస్ఏ చట్టం కింద ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. ఈ చట్టం కింద అరెస్ట్ అయినవారికి బెయిల్ లభించడం చాలా కష్టం.