27-09-2025 01:31:10 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత పోటీ చేస్తారని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో శుక్రవారం ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్తోపాటు పలువురు సీనియర్ నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు.
ఉప ఎన్నికలో బీఆర్ఎస్కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వేలన్నీ పార్టీ అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. విజయానికి ఉన్న ప్రతి అవకాశాన్నీ పార్టీ శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను అప్రమత్తం చేయాలని, బీఆర్ఎస్ హయాం లో చేపట్టిన అభివృద్ధిని నియోజకవర్గ ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇంటిం టికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను పూసగుచ్చినట్లు వివరించాలని సూచించారు.
సమన్వ యంతో పనిచేసి పార్టీ విజయం కోసం పని చేయాలని ఆదేశించారు. గోపినాథ్ కుటుంబానికి ఆ నియోజకవర్గంలో ప్రజాదరణ ఉండటం, స్థానిక ఆకాంక్షల మేరకే గోపీనాథ్ సతీమణికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాలతో జూన్ 8న కన్నుమూశారు. ఆయన మరణంతో ఈ స్థానం లో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల సంఘం త్వరలో ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించనున్నది.
తలసానికి పరామర్శ
మాజీ మంత్రి తలసాని శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం అందుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు కాల్ చేసి పరామర్శించారు. పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి సునీతను ఎంపిక చేసినట్లు సమాచారం అందించారు.