27-09-2025 01:41:37 AM
జన్శక్తి జనతాదళ్ పేరిట కొత్త పార్టీ
పాట్నా, సెప్టెంబర్ 26: బీహార్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ‘జన్శక్తి జనతాదళ్’ పేరిట కొత్త పార్టీని ప్రకటించారు. ఇటీవలే లాలూ ప్రసాద్ యాదవ్ తేజ్ ప్రసాద్ యాదవ్ను కుటుంబం నుంచి బహిష్కరించారు. పార్టీ జెండా, గుర్తులను తేజ్ ప్రతాప్ యాదవ్ ఎక్స్ వేదికగా స్వయంగా ప్రకటించడం గమనార్హం.
ఈ పార్టీ ఈసీ వద్ద ఇంకా రిజిస్టర్ చేయించుకోలేదు. బ్లాక్ బోర్డ్ను పార్టీ గుర్తుగా ప్రకటించారు. ‘బీహార్ పూర్తి అభివృద్ధి కోసం దీర్ఘకాల పోరాటానికి సిద్ధమయ్యాం’ అని తేజ్ ప్రతాప్ తెలిపారు. త్వరలోనే బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ.. తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.