19-08-2025 01:48:07 AM
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టులో చుక్క నీరు లేకున్నా.. మేడిగడ్డ కుంగినా, అన్నారం సుందిళ్లలో నీటి చుక్క ఆపకున్నా.. ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్లో ఉన్న ప్రాజెక్టులన్నీ జల కళ సంతరించుకున్నాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండటంతో ఉత్తర తెలంగాణలో వరద కాల్వతో పాటు మిడ్ మానేరు, ఎల్ఎండీలో క్రమంగా నీటి నిల్వలు పెరుగుతున్నాయి.
మహారాష్ర్టతో, ఎగువన గోదావరి పరివాహకంలో కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీకి మూడు రోజులుగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. సోమవారం మ ధ్యాహ్నం 1.25 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో న మోదైంది. దాదాపు 76,867 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. కాకతీయ కెనాల్కు 5 వేల క్యూసెక్కులు, ఎస్సారెస్పీ నుంచి 18 వేల క్యూసెక్కుల నీటిని ఇందిరమ్మ వరద కాల్వ ద్వారా మిడ్ మానేరుకు వదులుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు 18.92 టీఎంసీలకు చేరుకున్నాయి.
ఈ ప్రా జెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. 148 మీటర్ల గరిష్ట నీటి మట్టం కాగా.. ప్రస్తుతం 147.55 మీటర్ల నీటి మట్టం ఉంది. ఈ ప్రాజెక్టు పరివాహకంలో కురిసిన వర్షాలతో 48,293 క్యూసెక్కుల ఇన్ ప్లో ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తాగునీరు, ఎన్టీపీసీకి నీటిని విడుదల చేయటంతో పాటు.. నంది పంప్ హౌజుకు 6,300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నా రు.
ఆగస్టు 13వ తేదీ నుంచి ఐదు రోజులుగా ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు 4.12 టీఎంసీల నీటిని వదిలారు. మిడ్ మా నేరు జలాశయంలో 10.81 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ప్రస్తుత నీటి మట్టం 309. 63 మీటర్లు. ఈ నీటి మట్టం 311.14 మీటర్లకు చేరితే.. నీటి నిల్వ 13.13 టీఎంసీలకు చేరుతుంది. అప్పుడు ఒక పంప్ ఆన్ చేయటం వీలవుతుంది. ఇప్పుడున్న ఇన్ ఫ్లో ప్రకారం ఆగస్ట్ 20 నుంచి పంపింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయని ఇరిగేషన్ ఇంజనీర్లు తెలిపారు. మిడ్ మానేరు నుంచి నాలుగు పంప్లు రన్ చేయాలంటే 25.77 టీఎంసీల నీటి నిల్వ చేరాలి.