13-08-2025 01:31:36 AM
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ముట్టుకుంటే పడిపోయే స్థితిలో ఉన్న రంగానగర్ వాంబే ఇండ్లను త్వరలో కూల్చివేసి కొత్తగా ఇండ్లు నిర్మించి ఇస్తామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బాధితులకు హామీ ఇచ్చారు. మంగళవారం రంగానగర్ వాంబే ఇండ్ల బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, సికింద్రాబాద్, ముషీరాబాద్ తహసీల్దార్ అధికారులతో కలిసి శిధిలావస్తకు చేరుకున్న ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... వాంబే పథకం కింద 1998 లో నిర్మించిన పక్కా గృహాలను 44 కుటుంబాలకు అందజేశారని తెలిపారు. ఈ ఇండ్లు పూర్తిగా శిథిలావస్తకు చేరుకున్నాయని పేర్కొన్నారు. భవనంపై కప్పు పెచ్చులు ఊడి ఇంట్లో ఉండే వారి మీద పడడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. వర్షం పడితే ఏక్షణాన ఏమి జరుగుతుందో అని భయభ్రాంతులకు గురి అవుతున్నారని తెలిపారు.
సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన బాధితులకు ఇండ్లు కట్టించే ఏర్పాటు చేస్తామని అన్నారు. రంగానగర్ వాంబే ఇండ్లలో నివాసం ఉండే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బింగి నవీన్, భోలక్ పూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ రావు, నాయకులు రహీం, కృష్ణ, ప్రవీణ్, సుమన్, ఆరీఫ్, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ తదితరులు పాల్గొన్నారు.