09-10-2025 12:00:00 AM
- కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
- పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాల అమలు
- డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్, అక్టోబర్ 8: కెసిఆర్ అవినీతి అక్రమాలతో రాష్ట్ర ఖజానా దివాలా తీసినప్పటికీ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు.బుధవారం మండల పరిధిలోని శ్రీగిరిపల్లి గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షులు బాల్ రాజు, యూత్ ప్రెసిడెంట్ వెంకట్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ లో చేరగా, నర్సారెడ్డి వారికి కండువా కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుండగా, అర్హులైన ప్రతి పేదలకు ఇందిరమ్మ ఇల్లు, రూ 2 లక్షల రుణమాఫీ, సన్న బియ్యం పంపిణీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వంటి సాహసోపేత నిర్ణయాలతో ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐకి అప్పగించగా, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల పంపిణీ, పర్యాటక శాఖ, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర వాటిలో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సహచర మంత్రుల ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్లు చెప్పారు.
అయినప్పటికీ వాస్తవాలు మాట్లాడకుండా మాజీ మంత్రి హరీష్ రావు బాకీ కార్డు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండగా, తాము బి ఆర్ ఎస్ డోకా కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ 500 కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ తదితర వర్తింపజేస్తుండడంతో పేదలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టతకు కృషి చేసిన నేతలు చిమ్మిరెడ్డి, కుమార్ లను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు నరేందర్ రెడ్డి, సర్దార్ ఖాన్, పార్టీ బాధ్యతలు సుఖేందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.