05-01-2026 12:00:00 AM
ప్రక్రియలో ఎన్నో లోపాలు
వెంటనే వాటిని సవరించాలి
ఈసీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమత లేఖ
కోల్కతా, జనవరి ౪: ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో ఎన్నో లోపాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఆ లోపాలను సరిదిద్దాలి. లేదంటే బెంగాల్లో సర్ ప్రక్రియ నిలిపివేయాలి. రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ప్రక్రియను అత్యంత అశాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితా సవరణ కోసం వాట్సాప్ వంటి అనధికార మాధ్యమాలను వినియోగిస్తున్నారు. అది ఏ నిబంధన కింద వస్తుంది’ అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీస్తూ రాసిన లేఖ రాజకీయవర్గాల్లో సంచలనం సష్టిస్తోంది. బీఎల్వోలకు ఏరోజుకారోజు పొంతలేని సూచనలు వస్తుండటంతో వారు గందరగోళానికి గురవుతున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు.
సరైన శిక్షణ లేకుండానే సిబ్బందిని విధుల్లోకి తీసుకోవడం వల్ల తప్పుడు సమాచారం నమోదవుతున్నదని ఆరోపించారు. అలాంటి తప్పిదాల వల్ల లక్షలాది మంది అర్హులైన ఓటర్లు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా తాను ఇదే అంశంపై ఈసీకి అనేక లేఖలు రాశానని, అయినప్పటికీ ఈసీ స్పందించలేదని గుర్తు చేశారు.