27-12-2025 12:41:53 AM
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 26 (విజయక్రాంతి):వేములవాడ సమ్మక్కసారక్క జాతర ప్రారంభం కావడంతో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, బద్ది పోచమ్మ ఆలయం అనుబంధ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని. ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సూచించారు.
శుక్రవారం వేములవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆలయ ఈఓ ఎల్. రమాదేవి , ఆలయ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, హల్వా పందిర్లు, క్యూలైన్లలో సక్రమమైన ఏర్పాట్లు చేయడంతో పాటు శానిటేషన్ పనులు శుభ్రంగా నిర్వహించాలని ఆదేశించారు.జాతర సందర్భంగా వచ్చే భక్తులు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకునేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.