8 May, 2026 | 3:44 PM

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మార్గదర్శకాలు ఎందుకు చేయలే?

10-09-2024 05:00 AM
  1. మెడికల్ ప్రవేశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు 
  2. కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్లూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన తరగతి)లకు రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. మార్గదర్శకాల జారీపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ, విద్యాశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యఆరోగ్యశాఖ, సాధారణ పరిపాలనశాఖ, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసిం ది. 2024 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆగస్టు 28న ఇచ్చిన వినతి పత్రంపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పన నిమిత్తం తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాళోజీ నారాయణరావు వైద్యవిశ్వవిద్యాలయం జనవరి 1వ తేదీన లేఖ రాసిందన్నారు.

ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదన్నారు. మెడికల్ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేకుండా అడ్మిషన్లు కొనసాగుతు న్నాయని పేర్కొన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.