18-09-2025 12:34:32 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలో ఎలాంటి అంతరాయం కలగదని.. ప్రజలెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ర్టవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,400 కోట్లకు పైగా బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది.
దీంతో రాష్ర్టంలోని పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యాలు తమ బకాయిలను సర్కార్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రైవేట్ ఆసుపత్రులను కోరుతున్నామని చెప్పారు.
తామిచ్చిన స్వేచ్ఛను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏనాడు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయని వారు ఇప్పుడు ఎందు కు వైద్య సేవలను ఆపుతున్నారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద నెలకు రూ.50 కోట్లు కూడా విడుదల కాలేదని గుర్తు చేశారు.