17-01-2026 02:42:52 AM
ఆదిలాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): ఒక్క ఎకరానికి సైతం సాగు నీరు అందించలేనప్పుడు చనాకా- కొరాటా బ్యారేజ్ పంప్ హౌస్ నుండి నీటి విడుదల చేయడమేంటని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను బీఆర్ఎస్ అడ్డుకుంటామని ప్రకటించిన నేపద్యంలో పోలీసులు మాజీ మంత్రిని శాంతినగర్ లోని ఆయన స్వగ్రామంలో హౌస్ అరెస్టు చేశారు.
అర్దరాత్రి నుండే పెద్దఎత్తున పోలీసులను మోహరించి, మాజీ మంత్రి నీ బైటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాజీ మంత్రిని కలుసుకుని, పోలీసు వ్యవహరిస్తున్న తీరు ను తప్పుబట్టారు. ప్రజాస్వామికంగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి రామన్న మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన చేస్తున్న నిరసన కార్యక్రమాలను అక్రమ అరెస్టులతో ఆపలేరని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన రైతుల పక్షాన మరోసారి పచ్చి మోసానికి, దిగజారుడు తనానికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.