12-07-2025 12:58:24 AM
నిజామాబాద్, జూలై 11 :(విజయ క్రాంతి) మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల గురించి మహిళా సంఘాల సభ్యులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు డీఆర్డీఓ సాయగౌద్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.పద్మశ్రీ నేతృత్వంలో తెలంగాణా సంస్కృతిక సారథి కళా బృందాలు మహిళా సాధికారత కార్యక్రమాల గురించి తమ ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పిస్తున్నాయి.
ఇందులో భాగంగా శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎం.జీ ఫంక్షన్ హాల్ లో ఒక బృందం, దొంకేశ్వర్ మండలంలోని సత్తె గంగవ్వ ఫంక్షన్ హాల్ లో కళాజాత ప్రదర్శనలు నిర్వహించారు. వడ్డీ లేని రుణాలు, మహిళా సాధికారత, ఉచిత బస్సు ప్రయాణం, ఆరు గ్యారంటీల అమలు, మహిళా శక్తి కాంటీన్ లు, పెట్రోల్ బంకుల నిర్వహణ, సోలార్ పవర్ యూనిట్లు తదితర వాటిపై అవగాహన కల్పించారు.