27-09-2025 02:01:19 AM
అదిలాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): జిల్లాలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న అనాధ పిల్లలతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా తొలిసారి సమావేశం అయ్యారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం అనాథ పిల్లలు, కోవిడ్ పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్లతో కలెక్టర్ సమావేమై వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యా, ఆరోగ్యం తదితర అంశాలపై పిల్లలతో చర్చించారు.
ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆర్బీఎస్కే కాంపు ద్వారా పిల్లల రక్తపరీక్షలు నిర్వహించారు. అనంతరం పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. జిల్లాలోని 202 మంది పిల్లలకు ఆరోగ్యశ్రీ, 8 మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
వసతి లేని అనాథ పిల్లల సంరక్షకులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, వారి సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రతి మూడు నెలల కోసారి పిల్లలతో సమావేశమవుతామని పేర్కొన్నారు.