26-09-2024 12:00:00 AM
మద్యం అమ్మకాలే ప్రధాన ఆదాయ వనరుగా మారుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో మద్యం షాపులు విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్నాయి. తమిళనాడులో వివిధ జిల్లాల్లోని రైల్వే స్టేషన్ల సమీపంలో ఉన్న 50కి పైగా మద్యం దుకాణాలను తొలగించాలని దక్షిణ మధ్య రైల్వే స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
తమిళనాడులో మద్యం దుకాణాల నిర్వహణ రాష్ట్రప్రభుత్వం అధీనంలోనే జరుగుతున్న విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్ల వద్ద మద్యం దుకాణాల కారణంగా మద్యం సేవించిన వారు పట్టాలు దాటే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారని, అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఫలితంగా నేరాలు పెరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే తన ఫిర్యాదులో పేర్కొంది.
వాస్తవానికి దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి పబ్లిక్ స్థలాలకు దగ్గర్ల్లో మద్యం షాపులకు అనుమతులు ఇవ్వకూడదని గతంలో అనేక సందర్భాల్లో కోర్టులు తీర్పులు చెప్పాయి. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
తెలంగాణలో సైతం చాలా చోట్ల ఇలా నిషేధిత ప్రాంతాలకు దగ్గర్లో వైన్ షాపులు ఉండడం అందరికీ తెలిసిందే.ఈ షాపుల వల్ల ప్రయాణికులు, విద్యార్థులు, ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా ఉంటోంది. అయినా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మామూలు విషయమన్నట్లుగా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
సీతారామయ్య, ఉప్పల్