05-08-2025 11:50:50 PM
హుస్నాబాద్: గతంలో గుడుంబా కేసులో బైండోవర్ అయినప్పటికీ మళ్లీ అదే నేరానికి పాల్పడిన ఓ మహిళకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎక్సైజ్ పోలీసులు భారీ జరిమానా విధించారు. బెజ్జంకి మండలం చీలపూర్పల్లికి చెందిన దండ్ల రేణుక గతంలో గుడుంబా కేసులో పట్టుబడి తహసీల్దార్ ముందు బైండోవర్ అయింది. ఇటీవల ఆమె మళ్లీ గుడుంబా తయారు చేస్తూ పట్టుబడటంతో బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలింది.
దీంతో తహసీల్దార్ పంపరి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఆమెకు రూ.30,000 జరిమానా విధించినట్టు హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో మళ్లీ గుడుంబా తయారీ, అమ్మకాల్లో పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. గుడుంబా నేరాలకు పాల్పడేవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని తహసీల్దార్ చంద్రశేఖర్ హెచ్చరించినట్టు చెప్పారు. ఈ దాడుల్లో ఎస్సైలు రూప, దామోదర్, సిబ్బంది పాల్గొన్నారు.