23-08-2025 12:19:48 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
తూప్రాన్/మెదక్, ఆగస్టు 22(విజయక్రాంతి): ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి గ్రామాల అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు చేపట్టిన పనుల జాతర - 2025 కు శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం తూప్రాన్ పరిధిలో ఇస్లాపూర్, వెంకటరత్నాపూర్ గ్రామాలలో పనుల జాతర -2025 కార్యక్రమాన్ని డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి పండుగ వాతావరణంలో కలెక్టర్ ప్రారంభించారు.
ముందుగా ఇస్లాపూర్ గ్రామంలో రూ.3 లక్షల అంచనా వ్యయంతో ఎస్బిఎం గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల బ్లాకును కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం వెంకటరత్నాపూర్ గ్రామంలో రూ.92 వేల వ్యయంతో పశువుల పాక నిర్మాణానికి శంకుస్థాపన, రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భావన సముదాయాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
అనంతరం పంచాయతీ ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలల్లో రూ.20.60 కోట్ల వ్యయంతో 3,238 పనులు చేపట్టనున్నామని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు కలెక్టర్ గుర్తించిన పనులకు మంజూరు ఉత్తర్వులు జారీ చేశారు.
పనుల జాతరలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్...
పల్లెల ప్రగతి కోసమే పనుల జాతర కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగిందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మెదక్ నియోజకవర్గంలోని బాలనగర్ గ్రామంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా డీఆర్డీవో పీడీ శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, హౌసింగ్ పీడీ మాణిక్యం, పంచాయతీరాజ్ ఈఈ నరసింహులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కలిసి గ్రామ పంచాయతీ భావన సముదాయానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభోత్సవం చేశారు.
నియోజకవర్గంలో కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవనాలు పూర్తయి ప్రారంభించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, రూ.92 వేలతో నిర్మించిన పశువుల పాకను ప్రారంభించారు.