23-09-2025 05:30:54 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): వాస్తవ లాభాలపై వాటా ఇవ్వకుండా సింగరేణి కార్మికులకు జరిగిన మోసంపై మంగళవారం కాసిపేట 2 గని పై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు కారుకూరి తిరుపతి, సారంగపాణీలు మాట్లాడుతూ 2024, 25 సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాలు రూ 63 94 కోట్లకు గాను రూ 23 60 కోట్లు మాత్రమే ప్రకటించి రూ 4,000 కోట్లు పక్కన పెట్టడం సింగరేణి కార్మిక వర్గానికి తీరని మోసం చేసినట్లే అన్నారు.
రూ 5 లక్షల లాభాల వాటర్ రావలసిన కార్మికుని కి రూ 1,95,000కి పరిమితం చేయడం వారి శ్రమ ను దోచుకోవడమే అని అన్నారు. సింగరేణి అభివృద్ధికి పక్కన పెట్టిన డబ్బులు తెలియదు గాని ఈ సంవత్సరం లాభాల్లో చెల్లిస్తున్నామని చెప్పి రూ 63 94 కోట్లలో రూ 23 60 కోట్లకే లాభాల వాటా చెల్లింపును పరిమితం చేయడం అంటే వాస్తవ లాభాలలో 12.8% మాత్రమే కార్మిక వర్గానికి చెందిందని అన్నారు. దీనిపై పోరాడాల్సిన గుర్తింపు ప్రాథమిక సంఘాలు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. గత ఏడాది కూడా తెలంగాణ బొగ్గుబని కార్మిక సంఘం మాత్రమే లాభాల వాటా కోత పై నిరసన ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా సింగరేణి కార్మిక సంఘాలు కార్మిక వర్గానికి జరుగుతున్న నష్టం పై కలిసికట్టుగా పోరాడాలని కోరారు.