09-07-2025 06:36:34 PM
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు..
వలిగొండ (విజయక్రాంతి): కార్మిక వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న బిజెపి పాలనపై ప్రజలు తిరగబడాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు పిలుపునిచ్చారు. గురువారం కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వలిగొండ మండల కేంద్రంలో వందలాది మంది కార్మికులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం భువనగిరి నల్గొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సభకు సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాటూరు బాలరాజు మాట్లాడుతూ... బ్రిటిష్ పూర్వకాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి కార్మిక హక్కులను కాలరాసే చర్యలకు పాల్పడుతుందని వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలోని ఏకైక వామపక్ష ప్రభుత్వంగా ఉన్న కేరళలో రైతులకు కనీస మద్దతు ధరను కల్పిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారన్నారు. దేశాన్ని ఏలే బిజెపి కేరళ వామపక్ష ప్రభుత్వంలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మరొకవైపు అనేక వ్యవసాయ కార్మిక సంఘాలు వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా 2005లో ఏర్పడిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వ్యవసాయ కార్మికుల పొట్ట కొట్టే చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ఎత్తివేసి కార్మికుల హక్కులను తొలగించారని తిరిగి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.