11-07-2025 12:00:00 AM
పటాన్చెరు, జూలై 10 : పటాన్ చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో యాదవ సంఘం కళ్యాణ మండపం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం గోకుల్ నగర్ లో నిర్మిస్తున్న కళ్యాణ మండపాన్ని పరిశీలించి పనుల పురోగతిని తెలుసుకున్నారు.
అనంతరం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, యాదవ సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో రూ.2 కోట్లతో కళ్యాణ మండపం పనులు ప్రారంభించామని, తిరిగి జిహెచ్ఎంసి ద్వారా మరో రూ.2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు దేవయ్య యాదవ్, మేకల వెంకటేష్, శ్రీశైలం యాదవ్, మల్లేష్ యాదవ్, ప్రతినిధులు పాల్గొన్నారు.
జ్యోతిర్లింగ క్షేత్రం అభివృద్ధికి సహకారం..
మండల కేంద్రమైన జిన్నారంలో నిర్మిస్తున్న జీవనజ్యోతి జ్యోతిర్లింగం శివాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి దేవాలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యేమాట్లాడుతూ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. దేవాలయం నిర్మాణ అంశంలో ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరిలో పరమతసహనం పొందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.