16-10-2025 02:11:57 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన తునికి యోబు(20) పెద్దపాపయ్యపల్లిలో ట్రాక్టర్ తో ఇసుక అన్ లోడ్ చేసి ఇంటికి వస్తుండగా, రాంపూర్ గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ కింద యోబు పడడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన యోబు మృతదేహాన్ని స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.