09-10-2025 11:28:26 PM
రామచంద్రాపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఎల్ఐజీ కాలనీలో గ్యాస్ లీక్ను అరికట్టే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్ఐజీ కాలనీలోని 169 నెంబర్ ఇంటిలో భాస్కర్ కుటుంబం నివసిస్తోంది. వంటగదిలో సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అవుతుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు వచ్చారు. అయితే, గ్యాస్ లీకేజ్ ఆగిపోవాలని భావించి భాస్కర్ కుమారుడు మళ్లీ లోపలికి వెళ్లాడు. ఆ సమయంలో గ్యాస్ పేలుడు సంభవించడంతో గోడ కూలి యువకుడు కిందపడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని బీరంగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.