01-06-2025 01:21:50 AM
ఔట్సోర్సింగ్ సిబ్బంది వెతలు
* ప్రభుత్వం నుంచి వచ్చే జీతంలో చాలా మేర కాంట్రాక్టర్లు తమ జేబుల్లో వేసుకుని, వారు ఇచ్చింది తీసుకునేలా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని బెదిరిస్తున్నారు. వైద్య విధాన పరిషత్లో రాష్ట్రవ్యాప్తంగా 3,600 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తుండగా.. గత 6 నెలలుగా కొందరికి, 4 నెలలుగా మరికొందరికి, 2 నెలలుగా పలువురికి జీతాలు చెల్లించడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు.
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): అసలే బడుగు, బలహీన వర్గాలు, పేదలు.. కష్టపడి పనిచేసి, నెల నెలా వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించుకోవచ్చని వారి ఆశ. అయితే జీతం ఇవ్వకపోగా, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారం తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ)లో సర్వసాధారణంగా మారింది.
4 నెలలుగా జీతాలు లేక ఇళ్లు గడవటం కష్టంగా ఉందని.. కాంట్రాక్టర్లను జీతం అడిగితే.. ఇచ్చినప్పుడు తీసుకోవాలని, లేదం టే మీ స్థానంలో వేరే వాళ్లు ఉంటారని దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు ఔట్సోర్సింగ్ సిబ్బంది వాపోతు న్నారు. మే నెల ముగిసిపోయిందని, జీతా లు ఇవ్వకుంటే పిల్లల స్కూలు ఫీజులు కట్టే పరిస్థితి లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి వచ్చే జీతంలో చాలా మేర కాంట్రాక్టర్లు తమ జేబుల్లో వేసుకుని వారు ఇచ్చింది తీసుకునేలా సిబ్బందిని బెదిరిస్తున్నారు. వైద్య విధాన పరిషత్లో రాష్ట్రవ్యాప్తంగా 3,600 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తుండగా.. గత 6 నెలలుగా కొందరికి, 4 నెలలుగా మరికొందరికి, 2 నెలలు గా పలువురికి జీతాలు చెల్లించడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు.
జీతం కావాలా..
అన్నా.. జీతం లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నం. ఈ నెల స్కూల్ ఫీజు లు కట్టకపోతే పిల్లలను స్కూలుకు రానివ్వమంటున్నారు. దయచేసి జీతం ఇవ్వండని సిబ్బంది వేడుకుంటే.. ఇచ్చినప్పుడు తీసుకోవాలె.. లేదంటే నీ ప్లేస్లో ఇంకోడిని తీసుకుంటామని కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సెక్యూ రిటీ గార్డు విజయక్రాంతికి తెలిపారు.
ఇక నగరంలోని ఓ ఏరియా హాస్పిటల్లో 4 నెలలుగా వేతనాలు లేవని.. అడిగితే కాం ట్రాక్టర్ దబాయిస్తున్నాడని అక్కడ పనిచేసే పేషెంట్ కేర్ సిబ్బంది వాపోతున్నా రు. ఇంకొన్ని చోట్ల జీతం అడిగితే కొంత మొ త్తం ఫోన్పే చేస్తున్నారని, సర్కారు ఇచ్చినప్పుడు అకౌంట్లో వేస్తామని అం టున్నా రని సిబ్బంది తెలిపారు. ఇక పలు చోట్ల సెక్యూరిటీ గార్డులతోనే అన్ని పను లు చేయిస్తున్నా 6 నెలలుగా జీతాలు ఇవ్వ డం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీతాలు అడిగితే బంద్ చేసుకోవాలని బెదిస్తుండటంతో ఉన్న ఉద్యోగం పోతుందని భయపడి జీతం లేకపోయినా వెట్టిచాకిరీ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. వైద్యవిధాన పరిషత్లో సుమారు 60 మంది కాంట్రాక్టర్ల ద్వారా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించారు.
వైద్య సేవల్లో వీరిదే కీలకపాత్ర. పేరుకు సెక్యూరిటీ అయినా కట్లు కట్టడం, కుట్లు వేయడం, మందులు ఇవ్వడం, అటెండర్గా పేషెంట్ కేర్ సహా అన్ని పనులు చేయిస్తున్నారని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన ఓ సెక్యూరిటీ గార్డు తెలిపారు. తన పేరు రాస్తే విధుల నుంచి తొలగిస్తారని అందుకే తన గురించి తెలియకుండా చూడాలని సదరు సిబ్బంది విజయక్రాంతితో వాపోయారు.
20 ఏళ్లకు పైబడి పనిచేస్తున్నారు...
రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బంది కూడా ఉన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఔట్ సోర్సింగ్ నియామకాలు జరగలేదు. ప్రస్తు తం రాష్ట్రవ్యాప్తంగా వైద్యవిధాన పరిషత్ లో మూడు రకాలుగా (రూ. 13,600, రూ. 17,000, రూ. 19,600) వేతనాలు పొందే సిబ్బంది ఉన్నారు.
అయితే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నేరుగా కమీషన్లు ఇస్తున్నా, ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతంలోనూ ఒక్కొకరి నుంచి రూ. 2వేలకు పైగా కమీషన్ రూపం లో అక్రమంగా తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఫలితంగా సిబ్బంది నష్టపోతున్నా రు. దీనికి తోడు వారి పేరిట చెల్లించాల్సిన ఈఎస్ఐ, ఈపీఎఫ్ కూడా కట్టడం లేదు. ఈఎస్ఐ లేకపోవడంతో వైద్యం కోసం కష్టాలు పడాల్సివస్తోంది. ఇక ఈపీఎఫ్ అనేది ఉత్తిమాటగా మారిపోయింది.
చాలా చోట్ల కాంట్రాక్టర్లు వేధిస్తున్నారు..
రాష్ట్రవ్యాప్తంగా చాలో చోట్ల వైద్యవిధాన పరిషత్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి గత 6 నెలలుగా జీతాలు లేవు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు సిబ్బందికి జీతాలు ఇవ్వకపోగా వేధింపులకు గురిచేస్తున్నారు. జీతం అడిగితే ఉద్యోగం ఉండదని బెదిరిస్తున్నారు. అసలే చాలీచాలని జీతాలతో కష్టాలు పడుతున్న సిబ్బందిపై వేధింపులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునాలి. నెలనెలా వారికి జీతాలు చెల్లించాలి.
నర్సింహ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్
ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటే శాశ్వత పరిష్కారం..
రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఇంతవరకు కార్పోరేషన్ అయితే ఏర్పాటు కాలేదు. జూన్ 2నాటికి అయినా ప్రకటన చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
అలాగే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మాకు వేతనాలు అందించాలి. ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల చెల్లింపునకు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 4నుంచి 6 శాతం కమీషన్ ప్రభుత్వం ఇస్తుంది. అలాగే జీఎస్టీ 18శాతం చెల్లిస్తుంది. అయితే రాష్ట్రంలోని సుమారు 700 పైచిలుకు ఏజెన్సీలు జీఎస్టీలు చెల్లించడం లేదు. ఈఎస్ఐ 4శాతం, ఈపీఎఫ్ 25శాతం కట్టాలి కానీ ఎక్కడ కూడా దాదాపుగా అమలు కావడంలేదు.
ఎంప్లాయి షేర్ 12 శాతం జీతం నుంచి కట్ చేసి కాంట్రాక్టర్ జేబులో వేసుకుంటున్నడు. ఈ బాధలు పోవాలని చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఏపీలో కార్పోరేషన్ ఏర్పాటు చేసి 1వ తేదీ సాయంత్రమే జీతాలు ఇస్తున్నారు. అక్కడి సిబ్బందికి అన్ని సౌకర్యాలున్నాయి. కానీ మన వద్ద మాత్రం కాంట్రాక్టర్ల వల్ల ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్రంగా అన్యాయం అవుతున్నారు. ఈఎస్ఐ చాలా మందికి లేకుండా పోయింది.
ఫలితంగా వైద్యానికి భరోస లేదు. కాంట్రాక్టర్లను తొలిగించి ఏపీ మాదిరిగా కార్పోరేషన్ ఏర్పాటు చేస్తే ఏజెన్సీల కమీషన్, జీఎస్టీ ప్రభుత్వానికి మిగులుతుంది. ప్రభుత్వం ప్రస్తుతం రిలీజ్ చేసే జీతాన్ని నేరుగా కార్మికులకు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్లో 2 లక్షల మంది ఉంటారు. వారందరికీ న్యాయం జరుగుతుంది.
లక్ష్మయ్య, అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్
రెండు నెలలుగా జీతాలు లేవు
నేను కింగ్ కోటిలోని జిల్లా హాస్పిటల్లో పనిచేస్తున్నా. 2 నెలలుగా జీతాలు లేవు. మాకు వచ్చేదే నెలకు రూ. 11వేల జీతం. ప్రభుత్వం నుంచి డబ్బులు రానందున మీకు జీతాలు ఇవ్వలేకపోయామని కాంట్రాక్టర్ చెబుతున్నారు. మాకు నెలనెలా జీతం రాకపోతే ఇళ్లు గడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం దయచేసి వెంటనే మాకు జీతాలు ఇచ్చేలా చూడాలి.
పులికపాక సంతోషి, పేషెంట్ కేర్ సిబ్బంది
2 నెలలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి..
వైద్య విధాన పరిషత్లో రెగ్యులర్గా వేతనాలు చెల్లిస్తున్నాం. అయితే కాంట్రాక్టర్ల వార్షిక అగ్రిమెంట్ కారణంగా ఏప్రిల్, మే నెలకు సంబంధించి జీతాలు పెండింగులో ఉన్నాయి. వాటిని కూడా త్వరలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేసే వారి వివరాలు మాకు అందిస్తే సదరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. ఎక్కడికక్కడ స్థానిక వైద్యాధికారులు, సూపరింటెండ్లకు సిబ్బంది ఫిర్యాదు చేయాలి. వేధింపులకు పాల్పడితే సహించేది లేదు.
డా. అజయ్ కుమార్, కమిషనర్, వైద్యవిధాన పరిషత్