01-10-2025 12:45:42 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): గత ప్రభుత్వం కాళేశ్వరం.. ప్రస్తుత ప్రభుత్వం మూసీ జపం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. నార్సింగిలో ఆదిత్య వింటేజ్ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపడుతోందని, దీని అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీని వెనుక ఎవ్వరి ఉన్నారో చెప్పాలని, సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు ఎవరున్నారని ప్రశ్నించారు.
సర్వీస్ రోడ్డు క్లోజ్ చేసి బరితేగించి నిర్మాణాలు చేపడుతు న్నారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ నదిలో పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లు హైడ్రా కూల్చేసిందని, హైడ్రా అధికారులు అస్మదీయులకు ఒకరకంగా, తస్మదీయులకు మరోర కంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలన్నింటిపై సీఎంకి బహిరంగలేఖ రాస్తున్న ట్లు ఆయన తెలిపారు.
ఆపిన నిర్మాణాలకు మళ్లీ అనుమతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గం డిపేట జలాశయం 12 గేట్లు, 4 ఫీట్లు ఎత్తితేనే పరిస్థితి ఇలా ఉంటే.. అన్ని గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తితే హైదరాబాద్ పరిస్థితి ఏంటని పేర్కొన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ స్పందించాలన్నారు. హైడ్రా అధికారులు ఎందుకు స్పందించడం లేదని, మూసీనదిని శుద్ధి చేయాలని కలలుగంటున్న ముఖ్యమంత్రి.. మరోవైపు ఇలాం టి భవనాలు ఎలా వస్తున్నాయో పూర్తిస్థాయిలో విచారణ జరిపి తెలుసుకోవాలన్నారు.