08-08-2025 12:24:42 AM
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 దశ కింద తెలంగాణ ట్రాన్స్కో ఇచ్చిన ప్రతిపాదనలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన భట్టి.. గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ-3)లో సౌర విద్యుత్ సంస్థ (ఎస్ఈసీఐ) మొదట తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో మొత్తం 13.5 గిగావాట్ల సామర్థ్యం గ్రీన్ పవర్ (ఆర్ఈ) జోన్లను గుర్తించిందన్నారు.
వీటి ద్వారా పవర్, సౌర, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఎగుమతి చేయాల్సి ఉంటుందని భట్టి కేంద్ర మంత్రికి వివరించారు. ఎస్ఈసీఐ, తెలంగాణ రెడ్కోలతో చర్చించిన తర్వాత.. భూమి లభ్యత, పునర్వినియోగ విద్యుత్ సాధ్యాలను పరిగణనలోకి తీసుకుని ఆర్ఈ (గ్రీన్ పవర్) జోన్ల సామర్థ్యాన్ని 19 గిగావాట్లకు పెంచినట్టు వివరించారు. ఇది రాష్ట్రంలోని 8 జిల్లాలను కవర్ చేస్తుందన్నారు.
ఈ సవరణలకు అనుగుణంగా తెలంగాణ ట్రాన్స్కో మొత్తం 19 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన 8 ట్రాన్స్మిషన్ పథకాలతో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి, రూ. 6,895 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ (సీఈఏ)కు సమర్పించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్కో అందించిన ప్రతిపాదనలను తొందరగా అనుమతించాలని, ఇది రాష్ట్రంలో గ్రీన్ పవర్ అభివృద్ధిని, గ్రిడ్ ఇంటిగ్రేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి సహాయపడుతుందని ఖట్టర్కు భట్టి వెల్లడించారు.