09-08-2025 12:27:58 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 8 (విజయక్రాంతి): మూసీ పరివాహక ప్రాంతంలో కాజ్ వేలు, వాగులు, బ్రిడ్జిల రాకపోకలపై అప్రమత్తంగా ఉంటూ, డైవర్షన్ ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని , వరద ఉధృతి ఉన్నప్పుడు ఎవరినీ అనుమతించవద్దని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రోజు బీబీనగర్ పోచంపల్లి మధ్యలో ఉన్న రుద్రవెల్లి వద్ద మూసి కాలువ వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించడం జరిగింది.
నిన్న కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు జూమ్ మీటింగ్ ద్వారా జిల్లా అధికారులను అప్రమత్త చేయడం జరిగిందన్నారు. గ్రామపంచాయతీలలో శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసాలు ఉండొద్దని అన్నారు. గామపంచాయతీ అధికారులు గ్రామాలపై నిరంతరం దృష్టి పెట్టి దోమలు ప్రబలకుండా వర్షపు నీరు నిలిచిన చోట ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. మూగజీవాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు.