23-08-2025 05:20:12 PM
వైద్య సేవలకు అందుబాటులో ఉండాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు చేపట్టిన అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతున్న అమృత్ 2.0 పనులను తహసిల్దార్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ రమేష్ లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్ల ద్వారా నివాసాలకు త్రాగునీరు అందించడంతో పాటు అమృత్ 2.0 పథకంలో నిర్మిస్తున్న నీటి ట్యాంకుల ద్వారా త్రాగునీటిని సరఫరా చేసేందుకు పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వంద పడకల ఆసుపత్రి తనిఖీ
రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, జ్వర పీడితులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని తెలిపారు.
వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వార్డులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలకు అందించే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ఆసుపత్రికి ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలనన్నారు. డయాలసిస్ సెంటర్ ను పరిశీలించి కిడ్నీ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.