16-08-2024 02:25:10 AM
నాగర్కర్నూల్, ఆగస్టు 15 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా పరిషత్ కార్యాలయ అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ జెండాకు అవమానం జరిగింది. గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయం ముందు నిర్వహించిన జెండా వందనంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. జెండా ఎగుర వేసేందుకు సాయంగా తాడు కొనుగోలు చేయాల్సి ఉండగా, కక్కుర్తి పడి పాత తాడునే కట్టారు. దీంతో జెండా పూర్తిగా పైవరకు వెళ్లకుండా మొరాయించింది. దీంతో జడ్పీ సీఈవో దేవసహాయం జెండాకు రెండు ఫీట్లు కిందే పతాకాన్ని ఆవిష్కరించారు. దీనిపై జడ్పీ సీఈవోను వివరణ కోరగా పిన్నీస్ ఊడిపోయిందంటూ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు.