13-07-2025 07:27:51 PM
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం..
జ్ఞాపకాలు నెమరు వేసుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు..
సమాజానికి మార్గదర్శకంగా నిలవాలి..
పూర్వ హెడ్ మాస్టర్ జి వెంకటయ్య..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ఆ విద్యార్థులు, విద్యా బోధకులు 50 ఏళ్లకు కలుసుకున్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ హై స్కూల్(చెరువు కట్టబడి) విద్యార్థుల, ఉపాధ్యాయుల అపూర్వ కలయిక ఆద్యంతం భావోద్వేగానికి గురిచేసింది. 1974-75 పదోతరగతి బ్యాచ్ కి చెందిన బెల్లంపల్లి బస్తీ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనుభూతులను పంచింది. పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. విద్యార్థులు యాభై ఏళ్ల తర్వాత విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో, ఉపాధ్యాయులను కలుసుకోవడం మర్చిపోలేని జ్ఞాపకాలుగా నెమరు వేసుకున్నారు.
ఈ సందర్భంగా పూర్వ హెడ్మాస్టర్ జీ వెంకటయ్య మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు ప్రభుత్వ, సింగరేణి ఉద్యోగాలు చేసి ఉద్యోగ విరమణతో కుటుంబానికి పరిమిత కావద్దన్నారు. సమాజ హితం కోసం సేవలందించాలని ఉద్బోధించారు. పూర్వ సమ్మేళనంలో పూర్వ ఉపాధ్యాయులు గట్టు శ్రీహరి, ఎస్ జగన్నాథరావు, కృష్ణారావు, ప్రస్తుత హెడ్మాస్టర్ మాధవి, ఉపాధ్యాయులు సతీష్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు పూర్వ హెడ్ మాస్టర్ తో పాటు పూర్వ ఉపాధ్యాయులకు వస్త్రాలు, పూలమాలలు, శాలువాలతో ఆత్మీయ సత్కారం చేసి జ్ఞాపీకలు అందజేశారు.