06-08-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ ఆగస్టు 5 ( విజయక్రాంతి )ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన మరువకముందే వంట నిర్వాహకులు అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం సరైన పద్ధతి కాదని జిల్లా న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలను డీఈవో రమేష్ కుమార్, డిసిఓ ప్రశాంతితో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా వి ద్యార్థులకు వండి పెట్టె వంట గది పరిసరాలు అపరిశుభ్రంగా కనిపించడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అన్ని విధాల వసతులు కల్పిస్తున్న నిర్లక్ష్యం వహించడం సరికాదని ఇదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మరో ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడికక్కడే నిర్లక్ష్యం వహించిన డిసిఓ, ప్రిన్సిపాల్ లకు మెమో జారీ చేశారు.
కాలం చెల్లిన పాలతో పెరుగు తయారు చేయడం నాసిరకమైన కూరగాయలు క్వాలిటీ లేని బియ్యం వాడటం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన జరిగి కేవలం పది రోజులు కూడా గడవకముందే వంట నిర్వాహకులు శుభ్రత పాటించకపోతే ఎలా అంటూ మండిపడ్డారు.
గురుకుల పాఠశాలలో నిరుపేదల పిల్లలే చదువుతున్నారని వారు కూడా మన పిల్లలుగా భావించి సరైన భోజనం అందించాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తించాలన్నారు. అనంతరం బిజినపల్లి మండల కేజీబీవీ పాఠశాలను సైతం ఆకస్మికంగా సందర్శించారు.