06-08-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): అట్రాసిటీ బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించి భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా ఎస్. పి. కాంతిలాల్ పాటిల్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఏ ఎస్. పి. చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్ రావు లతో కలిసి జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అట్రాసిటీ బాధితులకు తక్షణమే న్యాయ సహాయం అందించి బాధితులకు భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి నెల 30వ తేదీన ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.
మహిళల అక్రమ రవాణా, డ్రగ్స్ నియంత్రణ, గంజాయి వంటి నిషేధిత పదార్థాలను నియంత్రించేందుకు గ్రామాలలో, కళాశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్ క్రింద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 21 కేసులు నమోదు చేయడం జరిగిందని, బాధితులకు నష్టపరిహారం అందించి కేసులు నమోదైన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
అట్రాసిటీ కమిటీ ప్రతి నిధులు మాట్లాడుతూ ఆదివాసీలు, మహిళలపై లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా పై దృష్టి సారించి ఇలాంటి ఘటనలు జరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. కేసులు నమోదైన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వకూడ దని తెలిపారు. అలాగే ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. కట్టెల పొయ్యి పై భోజనం వండటాన్ని గమనించి రేపటి నుండి గ్యాస్ పైన వంట చేయాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాము వద్ద నిరంతరం పటిష్టమైన రక్షణ చర్యలు అమలు చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని ఈవిఎం గోదాము వద్ద రక్షణ చర్యలను పరిశీలించారు. జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమం కోసం మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ఏర్పాటు కొరకు స్వచ్ఛంద సంస్థల ఎంపిక జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. వయోవృద్ధుల కొరకు మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంస్థల ఎంపిక కొరకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో సమావేశం నిర్వహించడం జరిగిందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు.