03-01-2026 04:21:12 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): భూ భారతి, 22-ఏ, సాదా బైనామా, అసైన్డ్ భూముల దరఖాస్తులన్ని పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు. జిల్లాలోని మండలాల తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితిగతులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... భూ సంబంధిత దరఖాస్తులను నిబంధనల ప్రకారం వేగవంతంగా పరిష్కరించాలని తహశీల్దార్లను ఆదేశించారు.
దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమయపాలనతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. పెండింగ్కు కారణాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే, క్షేత్రస్థాయిలో పరిశీలన అవసరమైన చోట ఆలస్యం లేకుండా నివేదికలు సమర్పించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
పోర్టల్ లో అప్ లోడ్ చేస్తున్నారని, ఫిజికల్ గా ఫైల్స్ పంపడం లేదని అందువల్ల ఆర్డిఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో ఫైల్స్ పెండింగ్ ఉంటున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలి
జిల్లావ్యాప్తంగా దెబ్బతిన్న ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారులకు తక్షణం మరమ్మతులు నిర్వహించాలని, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రమాదాలు జరగకుండా తగిన విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.