24-08-2025 01:13:56 AM
ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్లో చేరారు. అయితే ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయాన్ని తేల్చాలంటూ అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలు జారీచేసింది.
దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆయా ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారలేదని బుకాయిస్తున్నారు. కేవలం తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎం, మంత్రులను కలుస్తున్నట్టు దాటవేస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు మరి ఇంతకూ తమరు ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా ఉందని అంటుకుంటున్నారు. ఇంత బతుకుబతికీ ఇంటెనుక సచ్చినట్టు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఏ పార్టీలో ఉన్నమో చెప్పుకోలేని స్థితికి దిగజారిపోయారని జనాలు నవ్వుకుంటున్నారు.
క్రాంతి మల్లాడి