12-08-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, ఆగస్టు 11 ( విజయక్రాంతి ) : ఆగష్టు 15న జిల్లాలో నిర్వహించబోయే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగష్టు 15వ తేదీన జిల్లాలో నిర్వహించబోయే భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్వాతంత్య్ర వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు ఏర్పాట్లపై బాధ్యతలను అప్పగించారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున బందోబస్తు, ఫ్లాగ్ మార్చ్ ఏర్పాట్లు జిల్లా పోలీస్ శాఖ చూసుకోవాలని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, ప్రోటోకాల్, ముఖ్య అతిథులకు ఆహ్వానం బాధ్యతలను ఆర్డివో కు అప్పగించారు. బారీకేడింగ్, సౌండ్ సిస్టం, వేదిక ఏర్పాట్లను రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు.
ముఖ్య అతిథి ద్వారా ప్రజలకు ఇచ్చే సందేశానికి సంబంధించి వివరాలను స్పీచ్ కాపీ రూపొందించేందుకు సిపిఓ కు బాధ్యతలను అప్ప గించారు. నిరంతర విద్యుత్ సరఫరా, వేడుకలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యా నాయక్, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఇతర శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.