02-10-2025 12:33:45 AM
వికారాబాద్ జిల్లా తాండూరులో ఘటన
తాండూరు, అక్టోబర్ 1 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో ఘోరం జరిగింది. కదులుతున్న రైలు ఎక్కబోయిన ఏఎస్సై కిందపడి రెండు కాళ్లు తెగిపోయి మృతి చెందాడు. కర్ణాటకలోని చించోలి తాలూకా మర్పల్లికి చెందిన మారుతి (49) కలబురగి జిల్లా జేడీహల్లి పీఎస్లో ఏఎస్సుగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులకు వెళ్లేందుకు తాండూరు రైల్వేస్టేషన్లో రాత్రి 11 గంటల సమయంలో యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేందుకు యత్నించారు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి రైలు కింద పడ్డారు. రెండు కాళ్లు విరిగిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. రైల్వే సిబ్బంది తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు కలబురగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.