10-02-2025 01:32:56 AM
రంగారెడ్డి, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి)/చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై రామరాజ్యం పేరుతో కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 7న కొందరు వ్యక్తులు చిలుకూరులోని రంగారాజన్ ఇంటికి వెళ్లి తాము ఇక్ష్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో ఈ గ్రోతం ఉన్నవారిని, శాస్త్రం నేర్చే వారిని ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు.
కోర్టులో కేసులు ఎందుకు వేస్తు న్నారంటూ బెదిరించారు. ఉగాది వరకు అవకాశం ఇస్తున్నామని, రామరాజ్యం స్థాపన కోసం పని చేయాలంటూ అవమానకరంగా మాట్లాడుతూ దాడి చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారా యి. ఈ ఘటనపై రంగరాజన్ తండ్రి డాక్టర్ ఎం.వి సౌందరరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. రామరాజ్యం స్థాపనకు ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేస్తున్న కొందరు వ్య క్తులు వారి ప్రణాళికలను వ్యతిరేకించేవారిని హింసించాలని ప్రయత్నిస్తున్నారని సౌందర్రాజన్ ఆరోపించారు. కాగా దాడి ఘటనపై పోలీసులు స్పందించారు.
రంగరాజన్ నివాసానికి 20 మందికి పైగా వ్యక్తులు వెళ్లి రామరాజ్యం స్థాపనకు మద్దతు నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారన్నారు. అడ్డుకొనే ప్రయత్నించిన ఆయన కుమారుడిపై కుడా దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఘటనలో వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.