22-07-2025 10:57:27 PM
పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేయండి..
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్..
ఖమ్మం (విజయక్రాంతి): వర్షాలు పడడంతో మెట్ట పంటలతో పాటు ఇతర పంటలకు కూడా యూరియా అవసరం ఏర్పడిందని యూరియా కొరత రాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సమావేశం మంగళవారం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ అధ్యక్షతన గిరిప్రసాద్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి గోవిందరావు మాట్లాడుతూ, గత 15 రోజులుగా జిల్లాలో సరైన వర్షాలు లేకపోవడంతో రసాయనిక ఎరువుల వాడకం లేదని గడిచిన మూడు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు రసాయనిక ఎరువులను వాడుతున్నారని పత్తి, మొక్కజొన్న, ఇతర మెట్ట పంటలతో పాటు వర్షాల రాకతో వరి నాట్లు కూడా మొదలు కావడంతో యూరియా అవసరం పెరిగిందన్నారు. ప్రతి మండలంలోనూ ఎక్కువ సంఖ్యలో యూరియా విక్రయించే దుకాణాలను ఏర్పాటు చేయాలని పిఏసిఎస్ ద్వారా యూరియాను విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, బానోత్ రాంకోటి తదితరులు పాల్గొన్నారు.