అమితాబ్ తర్వాత నేనే

08-05-2024 12:00:08 AM

కంగనా రనౌత్

న్యూఢిల్లీ, మే 7: సినీ పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ తర్వాత సమానమైన ప్రేమ, గౌరవం తనకే లభిస్తున్నాయని సినీ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె, ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే లెజెండరీ నటుడు అమితాబ్‌తో తనను తాను పోల్చుకోవడం ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీయడంతో కంగనా తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు తనపై ఎంతో అభిమానం కురిపిస్తున్నారని పోస్ట్ చేశారు. ఒక నటిగానే కాకుండా జాతీయవాదిగా, మహిళా సాధికారత కోసం తాను చేస్తున్న కృషికి గౌరవం లభిస్తున్నట్లుగా తెలిపారు. తన వ్యాఖ్యలను కొందరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని, తనకు కాకపోతే ఖాన్‌లకు, కపూర్‌లకు గౌరవం లభిస్తుందా అని ప్రశ్నించారు.