15-08-2025 12:20:47 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, ఆగస్టు 14 (విజయక్రాంతి) : అతి భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ఎస్పి కే నరసింహ, అదనపు కలెక్టర్ పి రాంబాబులతో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, బుధవారం 17 మంది ఫోన్ చేసి సమస్యలు తెలుజేయగా అన్ని పరిష్కరించామన్నారు. ఇలాగే అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ మరో 48 గంటలు ప్రజలకి అందుబాటులో ఉండాల న్నారు.
గ్రామాలలో శిదిలావ్యవస్థలో ఉన్న పాత ఇల్లులు గుర్తించి అందులో ఉంటున్న ప్రజలను రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయం చేసుకుంటూ వారినీ రిలీఫ్ క్యాంపులోకి తరలించాలని సూచించారు. అలాగే గోడలు తడిసి ఉండటంవల్ల విద్యుత్ షాక్ తగలకుండా ఎలక్ట్రిసిటీ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎలాంటి డామేజ్ లు కాకుండా చూసుకోవాలన్నారు.
కల్వర్ట్ లు,బ్రిడ్జిలు పైనుండి నీరు ప్రవహిస్తే అక్కడ సిబ్బందిని నియమించాలని, ఎక్కడైనా రోడ్లు తెగితే వెంటనే సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కి తెలియజేయడంతో పాటు ,జాతీయ రహదారులపై నీరు నిలవకుండా చూడాలనారు. వైద్య శాఖ సిబ్బంది యాంటీవీనం ఇంజక్షన్, ప్రసవాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వరదల తర్వాత సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి వివి అప్పారావు, ఆర్డిఓ వేణుమాధవ్, డిపిఓ యాదగిరి, ఆర్ అండ్ బి ఎస్ ఈ సీతారామయ్య, పి ఆర్ ఈ ఈ మాధవి, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, సి పి ఓ కిషన్, డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, డి సీ హెచ్ ఎస్ వెంకటేశ్వర్లు, జి జి హెచ్ సూపరిటీడెంట్ శ్రవణ్ కుమార్, ఇరిగేషన్ అదికారి నవికాంత్, మిషన్ భగీరథ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.