09-07-2025 01:02:57 AM
ముంబై, జూలై 8: మహారాష్ట్రలో భాషా వివాదం మరోసారి భగ్గుమంది. మంగళవారం రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) థానేలో చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. ఇటీవల థానేలోని మీరా బయాందర్ ప్రాంతం లో ఒక ఫుడ్స్టాల్ వ్యాపారి మరాఠీ మాట్లాడేందుకు నిరాకరించడంతో ఆయనపై మహా రాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఎంఎన్ఎస్ నేతల దాడిని నిరసిస్తూ మీరా బయాందర్ ఏరియాలోని షాపు ఓనర్లు ఆందోళనలు చేపట్టారు. అయితే షాపు ఓనర్ల ఆందోళనలకు వ్యతిరేకంగా ఎంఎన్ఎస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. అయితే మీరా బయాందర్లో ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు ఎంఎన్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు ఎంఎన్ఎస్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే ఆ పార్టీ థానే అధ్యక్షుడు అవినాశ్ జాదవ్ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎంఎన్ఎస్ పార్టీకి నిరసన తెలిపేందుకు అనుమతి ఉన్నప్పటికీ.. వారు కేటాయించిన మార్గంలో కాకుండా మరో రహదారిలో నిరసనలు వ్యక్తం చేయడంతోనే స్థానిక నేతలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వివరించారు.
నిరసలకు అనుమతి ఇచ్చాం: సీఎం ఫడ్నవీస్
భాషా వివాదంపై నిరసనల్లో పాల్గొన్న కొందరు ఎంఎన్ఎస్ కార్యకర్తలు మరాఠీ ప్రజల మార్చ్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. దీనిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. ఎంఎన్ఎస్ నిరసన ర్యాలీకి తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అయితే థానేలో ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎంఎన్ఎస్ నిరసన ప్రదర్శనలకు ఒక నిర్దిష్ట మార్గాన్ని కేటాయించారన్నారు.
అయితే దీనిని కాదని ఎంఎన్ఎస్ నేతలు వేరే మార్గంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని, దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయిందన్నారు. అందుకే పోలీసులను పంపించి వారి నిరసన ర్యాలీని అడ్డుకున్నట్టు పేర్కొన్నారు. మీరా బయాందర్ ప్రాంతంలో వ్యాపారులు మార్చ్ నిర్వహించారని.. అదే ప్రాంతంలో తమకు మాత్రం నిరసన తెలిసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు.
మరాఠీ మాట్లాడనందుకు దాడి..
థానేలోని మీర్ బయాందర్ ప్రాంతంలో 48 ఏళ్ల బాబులాల్ చౌదరీ ‘జోధ్పూర్ స్వీట్ షాప్’ నిర్వహిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన బాబులాల్ తన వర్కర్లతో హిందీలో మాట్లాడటం ఎంఎన్ఎస్ కార్యకర్తలు విన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు షాపులోకి వచ్చి మీరు, మీ పనివాళ్లు ఇకపై మరాఠీలోనే మాట్లాడాలని హెచ్చరించారు.
దీనికి షాపు యజమాని బాబులాల్ ఏ భాష మాట్లాడితే మీకెందుకు అని ఘాటుగా సమాధానమిచ్చారు. కాగా బాబులాల్పై దాడిని నిరసిస్తూ స్థానిక వ్యాపారులు నిరసనలు చేపట్టారు.
ఠాక్రే సోదరులకు బీజేపీ ఎంపీ హెచ్చరిక
మహారాష్ట్రలో హిందీ మాట్లాడే ప్రజలపై ఇటీవల జరుగుతున్న దాడులపై జార్ఖండ్కు చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్ప ందించారు. మరాఠా భాష పేరుతో హింసాత్మక దాడులకు ప్రేరేపిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే, రా జ్ ఠాక్రేలపై మండిపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్, బీ హార్ లేదా తమిళనాడులో ఇలాంటి దా డులు చేయాలని సవాల్ విసిరారు.
యూపీ, బీహార్, తమిళనాడుకు వెళితే ప్రజలు పెడేల్మని కొడతారని హెచ్చరించారు. కాగా త్రి భాష అమలు నిర్ణయాన్ని మహారాష్ట్ర స ర్కారు వెనక్కి తీసుకున్న నేపథ్యంలో 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు ‘విజయోత్సవ సభ’ నిర్వహించిన సంగతి తెలిసిందే.