కుంటాలలో భూభారతి పైలట్ ప్రాజెక్ట్
16 గ్రామాల్లో ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు
నిర్మల్ మే 4 విజయ క్రాంతి): భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా కుంటాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ మేరకు మండలంలోని 16 గ్రామాల్లో ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు మూడు ప్రత్యేక బృందాలను నియమించామని తెలిపారు.
భూములకు సంబంధించిన సమస్య లు, పాత రికార్డుల సమస్యలు, పేరుమార్పులు వంటి అంశాలను స్థానిక ప్రజలు ఈ సదస్సుల్లో దరఖాస్తుల రూపం లో ఇవ్వొచ్చని సూచించారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెవె న్యూ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
జూన్ 2వ తేదీ వరకు పైలట్ ప్రాజెక్ట్ కింద అందిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని, అవసరమైన కార్యాచరణను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. భూభారతి అమలుతో ప్రజలకు తక్షణ సత్వర సేవలు అందేలా చర్యలు చేపడతామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






