02-05-2025 01:01:42 AM
జిల్లా వ్యాప్తంగా 47మందికి రూ.47 లక్షలు
1339 మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు
600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపు నిర్మించే వారికే బిల్లులు
మెదక్, మే 1(విజయక్రాంతి) :పేదల సొంతింటి కల సాకారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడత బిల్లులు వచ్చేశాయి. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ముగ్గుపోసి బేస్మెంట్ వరకు పూర్తిచేసిన లబ్దిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున పడుతు న్నాయి. ఇప్పటి వరకు 47 మంది ఖాతాల్లో రూ.47 లక్షలు జమ అయ్యాయి.
మొదటి విడత రూ.లక్ష చొప్పున..
మండలానికి ఒక గ్రామం చొప్పున జిల్లా లో 21 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతగా బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి చేసిన వారి ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమ అవుతున్నాయి.
ఈ 21గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న వారిలో 1339 మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. గ్రౌం డింగ్ పూర్తి చేసిన వారు 350 మంది ఉన్నా రు. వీరిలో బేస్మెంట్ వరకు పూర్తి చేసిన 47 మందికి ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ.47 లక్షలు గతవారమే వారి ఖాతాల్లో జమ అయ్యాయి.
600 చదరపు అడుగులకు మించి కట్టుకుంటే.. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం పెట్టుకొని ఇంటి నిర్మాణం చేపట్టి బేస్మెట్ పూర్తయిన లబ్దిదారులందరికీ మొదటి విడత బిల్లులు పడ్డా యి. 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీ ర్ణంలో కట్టుకున్న వారికి బిల్లులు పడలేదు.
ప్రభుత్వ నిబంధల ప్రకారం ఇల్లు నిర్మించుకున్న వారి వివరాలను, ఇంటి కొలతలను ఆన్లైన్లో నమోదు చేస్తే ఆటోమెటిక్ గా నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం ఉందా లేదా అనే విషయాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు.
నిబంధనలకు లోబడి కట్టుకున్న వారికి వెంటనే బిల్లులు వస్తున్నాయని అంటున్నారు. వీరిలో కొందరు తెలియక ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకుంటే మరికొందరు తెలిసి కూడా కట్టుకున్నవారు ఉన్నారు. అయితే 600 అడుగుల విస్తీర్ణం కంటే మించి నిర్మించుకున్న లబ్దిదారులకు బిల్లులు రావడంలేదు.
అర్హులు వెంటనే పనులు మొదలు పెట్టాలి...
మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హుల జాబితాలో పేర్లు ఉన్న వారు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులు సూ చిస్తున్నారు. పనులు మొదలు పెట్టి బేస్మెంట్ పూర్తి చేసుకుంటే మొదటి విడత బిల్లులు పడతాయని అధికారులు చెబుతున్నారు.
నిబంధనల ప్రకారమే నిర్మించుకోవాలి..
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఇష్టానుసారంగా ఇళ్లను నిర్మించుకొని ఇబ్బందులు పడొద్దు. 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులలోపు విస్తీర్ణంలో కట్టుకోవాలి. ఈ నిబంధల మేరకు ఇళ్లు నిర్మించుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అదే విధంగా అర్హత జాబితాలో పేరున్న వారు కూడా ఇంటి పనులుప్రారంభించాలి.
మాణిక్యం, హౌజింగ్ పీడీ, మెదక్