26-07-2024 05:22:15 AM
హైదరాబాద్, జులై 25 (విజయక్రాంతి): బీఆర్ఎస్ నేతలు పిక్నిక్కు వెళ్లారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు కూలిన మేడిగడ్డను చూసి వస్తారా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు మేడిగడ్డకు వెళ్లడంతో శ్రీధర్బాబు పై విధంగా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు ఎన్నిసార్లు వెళ్లితే తమకు అంత మేలు జరుగుతుందని అన్నారు. అసెంబ్లీకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తుందో అర్థమయ్యేదని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్న ప్రభుత్వం.. సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పనులకు నిధులు ఎలా సమకూర్చుకుంటుందని మీడియా ప్రశ్నించగా, నిధులు ఎలా తీసుకురావాలనేది తమకు స్పష్టమైన వ్యూహం ఉందని చెప్పారు. తమ వ్యూహాలను బయటికి చెబితే, ప్రతిపక్షం అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు.