06-12-2024 01:33:45 AM
సూర్యాపేట, డిసెంబర్ 5 (విజయక్రాంతి): తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లాకు చెందిన శీలంచెట్టి వెంకటరమణ డ్రైవర్గా పనిచేస్తూ, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. ఇతడిపై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, సూర్యాపేట టౌన్, రూరల్ పోలీస్స్టేషన్లలో ఇదివరకే కేసులు నమోదయ్యాయని.. విజయవాడలోనూ హిస్టరీ షీట్లు ఉన్నట్లు తెలిపారు.
గురువారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న వ్యక్తిని సీఐ, సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.15.20 లక్షల విలువ గల 19 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. కేసును ఛేదించిన డీఎస్పీ రవి, సీఐలు రాజశేఖర్, వీరరాఘవులు, సిబ్బందిని అభినందించి రివార్డు అందించినట్లు ఏఎస్పీ తెలిపారు.